Pages

Friday, February 20, 2015

ఎమ్బీయస్‌: నిర్మాత పదానికి నిర్వచనం- రామానాయుడు - 1

Published Date : 20-Feb-2015 13:58:51 GMT
రామానాయుడుగారికి ఘననివాళి లభించింది. ఆయనా, ఆయన వారసులు పరిశ్రమలో యింకా ప్రముఖులు కాబట్టే.. అనడానికి లేదు. ఆయన వలన మేలు కలిగినవారు ఎందరో వున్నారు. మంచిమనిషిగా, హుందాతనాన్ని కాపాడుకుంటూ చివరి వరకూ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ లైమ్‌లైట్‌లోనే వున్నారు కాబట్టి అనుకోవాలి. ఆయన గురించిన విషయాలు చాలాకాలంగా అందరూ చెప్పుకునేవే. ఆయన జీవితచరిత్రలు వచ్చాయి. వ్యాసాలు వచ్చాయి, అనేక టీవీ యింటర్వ్యూలు వచ్చాయి. ఆయన ఏ విషయాన్నీ దాచుకోలేదు. తన బలమేమిటో, బలహీనత ఏమిటో, ఎప్పుడు ఏ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత వచ్చిందో, ఎంత పోయిందో, ఎక్కడ సక్సెసయారో, ఎందుకు బోర్లా పడ్డారో అన్ని వివరాలూ స్పష్టంగా చెప్పారు. మనం కొత్తగా చెప్పేదేమీ లేదు - కొన్ని పరిశీలనలు చేయడం తప్ప! 

ఈ రోజు ఆయనకు నీరాజనాలు అర్పించిన నిర్మాతలు రామానాయుడుగారి అంశ తమలో ఏ కొంచెమైనా వుందా లేదా అన్నది వారంతట వారే తరచి చూసుకోవాలి. రేపు మనం వెళ్లిపోయిన తర్వాత మన గురించి యిలా చెప్పుకుంటారా మరోలా చెప్పుకుంటారా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఆయన రోజులు వేరు, మా రోజులు వేరు అనే వాదన నప్పదు. రామానాయుడు గారే చెప్తూ వుండేవారు - 'పరిస్థితులు ఏం మారాయి? సక్సెస్‌ రేటు ఎప్పుడూ పదిశాతమే అని. ప్రణాళికాబద్ధంగా వెళ్లినవారు నిలదొక్కుకున్నారు, లేనివారు లేదు' అని. ఆయన గొప్పతనం ఏమిటంటే - సినిమాను ఆయన వ్యాపారంగా చూశారు. చాలామంది దాన్ని జూదంగా చూస్తారు. వేరే చోట డబ్బు మిగిలితే యిక్కడ పెడదామని కొందరు, దీనిలో అర్జంటుగా గడించేసి వేరే చోట పెడదామని కొందరూ అనుకుంటారు. ఏ వ్యాపారానికైనా పెట్టుబడిదారుడు ముఖ్యం. ఎంత గొప్ప నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా, గాయకుడికైనా, కళాకారుడికైనా - తన ప్రతిభ చూపించాలంటే ఒక వేదిక కావాలి. అది కల్పించేవాడికి శక్తి, ఆసక్తి రెండూ వుండాలి. నిర్మాతకు టేస్టు లేకపోతే ఎంత గొప్ప సినిమాయైనా రూపొందదు. అందువలన నిర్మాతే తొలిగౌరవాన్ని అందుకోవాలి. కానీ సినిమారంగంలో ఆ పరిస్థితి లేదు. డివి నరసరాజుగారి మిత్రులు కొందరు యీ రంగంలోకి రాబోయి మానేశారట. ఏమంటే 'ఎక్కడైనా డబ్బిచ్చినవాడికి అందరూ దండాలు పెడతారు. ఇక్కడేమిటండీ బాబూ, డబ్బూ మనమే యిచ్చుకోవాలి, దండాలూ మనమే పెట్టుకోవాలి' అన్నారట.  

కథ చూసుకోవడం, సరైన వాళ్లను ఎంచుకుని బాధ్యతలు అప్పగించడం, ప్లానింగ్‌ చేసుకుని, దగ్గరుండి అన్నీ అమలయ్యేట్లు చూసుకోవడం - యివే నిర్మాత పనులు. ఈ రోజు నిర్మాత కథ చుట్టూ కాకుండా హీరోల కాల్షీట్ల కోసం వెతుకుతున్నారు. డైరక్టరు తనకు కథ చెప్పకపోయినా, బజెట్‌ ఎంతవుతుందో చెప్పకపోయినా డబ్బులు అప్పు తెచ్చి అతని చేతిలో పోస్తున్నాడు. ఎందుకు? అతను దాన్ని రెట్టింపు చేసి మళ్లీ తన చేతిలో పోస్తాడన్న దురాశతో! ప్రాక్టికల్‌ థింకింగ్‌ లేదు. ఏదో అద్భుతం జరిగిపోయి, మన సినిమాను హీరో, డైరక్టరు ఆడించేస్తారు అని ఆశ పెట్టుకుని తక్కినవాటిని పట్టించుకోవడం లేదు. రామానాయుడుగారు ఎప్పుడూ చెప్పేవారు - 'ఏట్లో పారేసినా ఎంచి పారేయాలి' అని. సెట్లో నిర్మాత వుంటే ఖర్చులో కనీసం 30% ఆదా అవుతుంది అని. సినిమాను  యిండస్ట్రీగా చూసినవారే బాగుపడతారు, పద్ధతీపాడూ లేకుండా, పబ్లిసిటీ కోసం విచ్చురూపాయలను విచ్చలవిడిగా విరజిమ్మేవారు ఖర్చయిపోతారు.  

రామానాయుడి గారి జీవితం మనకు స్ఫూర్తిదాయకం అంటూ పైకి చెప్పడం కాదు, ఏ వ్యాపారం చేసినా ఎంత శ్రద్ధగా చేయాలో ఆయనను చూసి కొంతైనా నేర్చుకోవాలి. డబ్బుంది కదాని ఆస్తులన్నీ అమ్మేసి సినిమా వ్యాపారంలోకి ఒక్కసారిగా దూకలేదు. డబ్బింగ్‌ సినిమా తీద్దామనుకుని, రామినీడుగారి సలహాతో చిన్న బజెట్‌ సినిమాలో భాగస్వామిగా దిగారు. రామినీడు వద్ద సినిమా రంగంలోని మెళకువలతో బాటు ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు కూడా తెలుసుకున్నారు. మార్కెటింగ్‌లో వున్నవారికి ప్రెజెన్స్‌, పర్శనాలిటీ ఎలా అవసరమో, నిర్మాతకు కూడా మాటమంచితనం, ఎవరినైనా ఒప్పించగల నేర్పు వుండాలి. ''అనురాగం'' సినిమాలో తన కిచ్చిన పాత్ర చిన్నదని ఫీలైన షావుకారు జానకి వేషం వేయనన్నారు. దర్శకనిర్మాతలు చెప్పినా వినలేదు. అప్పుడు యీయన వెళ్లి 'ఇది నా ప్రథమ ప్రయత్నం, సహకరించండి' అని అడిగితే ఆవిడ 'మీకోసం చేస్తా' అంటూ ఒప్పుకున్నారు. 'కావాలంటే పారితోషికం ఎక్కువడగండి, యిస్తాం' అని పొగరుగా మాట్లాడి వుంటే పని అయివుండేది కాదు.  

నిర్మాతకు విజన్‌ వుండాలి. ''రాముడు-భీముడు'' లాటి కథను ఎందరో పెద్దలు తిరస్కరించారు. కానీ యీయన దానిలో బంగారుగనిని చూడగలిగాడు. దానిపై భారీగా పెట్టుబడి పెట్టాడు. అదే ఆయన్ను నిలబెట్టింది. ఆ సినిమా ఎన్ని భాషల్లో, ఎన్ని రకాలుగా వచ్చిందో అందరికీ తెలుసు. కథకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత యిచ్చాడు. తమిళంలో నుంచి చాలా కథలు తీసుకున్నారు, రీమేక్‌లు చేశారు, తమిళ రచయితల కథలు తీసుకున్నారు, తెలుగు నవలలను సినిమాలుగా తీశారు, చివరిదాకా ఆయన కొత్త కథలు వింటూనే వున్నారు. కథలు నచ్చితే స్క్రిప్టు తయారుచేసి దాచి వుంచుకుని అవసరమైనపుడు బయటకు తీసిన సందర్భాలూ వున్నాయి. ఆయన అంచనాలు అన్ని వేళలా కరక్టు కాలేదు, కెరియర్‌లో చాలా ఫెయిల్యూర్లు వున్నాయి. ఏ వ్యాపారంలోనైనా అది సహజం. ఎక్కడా ఆగకుండా వరుసగా తీసుకుంటూ పోవడంతో టర్నోవర్‌ కారణంగా ఆయన సంస్థ నిలబడింది. వరుసగా ఫ్లాపులు వచ్చి దుకాణం కట్టేస్తారేమోననుకుంటే ఒక హిట్‌ వచ్చి నిలబెట్టేది. 1979-82 మధ్య ''ఒక చల్లని రాత్రి'', ''కక్ష'', ''అగ్నిపూలు'', ''ప్రేమమందిరం'' వచ్చి కోటి రూపాయల డెఫిసిట్‌లోకి వెళితే ''దేవత'' (1982) వచ్చి మళ్లీ వూపిరి పోసింది. (సశేషం) 
-  ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 4

నవంబరు 20 న రాజపక్షతో కలిసి విందారగించిన మైత్రీపాల మర్నాడు పొద్దున్నకల్లా ''ఈ దేశపు ఆర్థికవ్యవస్థను, సాంఘికవ్యవస్థను ఒకే ఒక్క కుటుంబం శాసిస్తోంది. అందుకే బయటకు వచ్చేశా..'' అన్నాడు. ''వెన్నుపోటుదారులు యిలాగే వుంటారు'' అన్నాడు రాజపక్ష. విభీషణుడితో పోలిక తేలేదు, తను రావణుడు అనుకుంటారని, అంతిమంగా ఓడిపోతానని అనుకుంటారనీ! పోలీసు వ్యవస్థపై యింత పట్టు బిగించినా, తన వీపు వెనక్కాల యింత కుట్ర జరగడం అతను హరాయించుకోలేక పోయాడు. మైత్రీపాలతో బాటుగా ఐదుగురు ఎంపీలు కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఒకరొకరుగా చాలామంది మంత్రులు కూడా.. ! అందర్నీ రాజపక్ష పార్టీలోంచి బహిష్కరించాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి న్యూ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎన్‌డిఎఫ్‌) ఏర్పరచారు. ఈ కూటమిలో రైటిస్టు భావాలున్న యుఎన్‌పి, మార్క్సిస్ట్‌ భావాలు కల జెవిపి, బౌద్ధ సన్యాసులు నడిపే జెఎచ్‌యు, రెండు ముస్లిము పార్టీలు, తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ - లాటి భిన్న దృక్పథాలున్న పార్టీలున్నాయి.  

ఇంతమంది కలిసినా రాజపక్షపై విన్నింగ్‌ మార్జిన్‌ 3.7% మాత్రమే (81.5% పోలింగు జరగగా మైత్రీపాలకు 51.28%కు వచ్చి 12 ఎలక్టొరల్‌ జిల్లాలలో నెగ్గగా రాగా, రాజపక్షకు 47.58% వచ్చి 10 జిల్లాలలో నెగ్గాడు) అంటే రాజపక్ష ఎంత బలంగా పాతుకుపోయాడో చూడండి. 2010 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలలో అతని యుపిఎఫ్‌ఏకు 60.33% ఓట్లు, 225 సీట్లలో 160 సీట్లు వచ్చాయి. అతని కూటమిలో సిలోన్‌ వర్కర్స్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, లంక సమ సమాజ పార్టీ, నేషనల్‌ ఫ్రీడమ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌, అప్‌ కంట్రీ పీపుల్స్‌ ఫ్రంట్‌ యిలా అనేకానేక పార్టీలున్నాయి. బోధుబలసేన మద్దతు ఎలాగూ వుంది. నవంబరు 18న జాతిక హేలా ఉరుమాయ అనే పార్టీ రాజపక్ష కూటమినుండి అతను పాలనా సంస్కరణలు చేపట్టటం లేదన్న అభియోగంతో బయటకు వచ్చేట్లా చేశారు. 2014 డిసెంబరు 8 నామినేషన్ల దినం కాగా అదే రోజున యిద్దరు ప్రతిపక్షాల ఎంపీలు రాజపక్షవైపు ఫిరాయించారు. వారిలో ఒకరిని రాజపక్ష మైత్రీసేన స్థానంలో ఆరోగ్యమంత్రిగా నియమించాడు. డిసెంబరు 23 న ప్రభుత్వపక్షం నుండి శ్రీలంక ముస్లిమ్‌ కాంగ్రెస్‌, ఆల్‌ సిలోన్‌ ముస్లిమ్‌ కాంగ్రెస్‌ అనే పార్టీలు బౌద్ధుల దాడుల నుంచి ముస్లిములకు రక్షణ కల్పించడం లేదన్న ఆరోపణతో ప్రతిపక్షంవైపు ఫిరాయించారు.  

ఇలాటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ఎలా సాగిందో, ఏయే సేనలు ఎటు మోహరించాయో గమనించడం ఆసక్తికరంగా వుంటుంది. రాజపక్ష అంటే మైనారిటీలకు, తమిళులకు అసహ్యం కాబట్టి జనాభాలో వాళ్లు 25% కాబట్టి, వాళ్లకు నచ్చేట్లా వాగ్దానాలు గుప్పిస్తే ఓట్లు కురుస్తాయని మైత్రీసేన అనుకోలేదు. ఎందుకంటే తమిళ టైగర్లను అణిచేసిన చరిత్ర అతనికీ వుంది. అందువలన 2009 నాటి యుద్ధనేరాలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలన్న కోరికకు తల వొగ్గలేదు. అలాగే ముస్లిము, క్రైస్తవులపై దాడుల గురించి విచారణ జరిపిస్తాననీ అనలేదు. మెజారిటీ బౌద్ధులను, సింహళీయులకు నచ్చేట్లా బౌద్ధమతానికి రాజ్యాంగరీత్యా ప్రముఖస్థానాన్ని కొనసాగిస్తానని హామీ యిచ్చాడు. ఆ విధంగా అతను రాజపక్ష ఓటుబ్యాంకులోకి చొరబడి అన్ని మతాలకు చెందిన సింహళ ఓట్లను కొల్లగొట్టాడు. మధ్య, దక్షిణ ప్రాంతాలలో ఆధిక్యత సంపాదించాడు. రాజపక్షకు గ్రామీణ ప్రాంతాలలో, సింహళ-బౌద్ధులున్న దక్షిణాగ్ర శ్రీలంకలో, ఆధిక్యత వచ్చింది. అక్కడ రాజపక్షకు 2% ఎక్కువ ఓట్లు రాగా, ఉత్తరాన, తూర్పున వున్న తమిళ, ముస్లిం ఓట్లు మైత్రీసేనకు తోడయ్యాయి కాబట్టి అతను రాజపక్ష కంటె కొద్దిపాటి మొగ్గు సంపాదించి నెగ్గేశాడు. హింసకు, వివక్షతకు, నిరుద్యోగానికి గురైన మైనారిటీలు, తమిళులు కసితో బూతుల వద్ద బారులు తీరి మైత్రీసేనకు విజయం కట్టబెట్టారు. 2010 ఎన్నికలలో రాజపక్ష ఎన్నిక కచ్చితం అని తెలుసు కాబట్టి అప్పుడు తమిళులు ఎన్నికల పట్ల ఆసక్తి చూపలేదు. ఎవరు కారణమో తెలియదు కానీ ఎన్నికల రోజున తమిళ ప్రాంతాలైన పాయింట్‌ పెడ్రో, వావూనియాలలో బాంబులు పేలాలి. తమను భయపెట్టి బూతులకు దూరంగా వుంచాలనే ప్రయత్నమే అనుకుని తమిళులు మరింత పట్టుదలతో ఓట్లేయడానికి వచ్చారు. మైత్రీసేన అక్కడకు ప్రచారానికి రాకపోయినా రికార్డు స్థాయిలో 68% పోలింగు జరిగింది.  

ఎన్నికలకు ముందుగా రాజపక్ష యిచ్చిన తాయిలాలను విమర్శించాలో లేదో ప్రతిపక్షం తేల్చుకోలేకపోయింది. వద్దంటే ఆ యా వర్గాలకు కోపం వస్తుందని భయం. ప్రభుత్వం 55 బిలియన్‌ డాలర్ల అప్పులో కూరుకుపోయిందని మాత్రం నిందిస్తూనే తాము అధికారంలోకి వస్తే అవన్నీ కొనసాగిస్తాయని హామీ యిస్తూ ఆ మాటకొస్తే పబ్లిక్‌ సెక్టార్‌లో జీతాలను 5000 పెంచుతాయని కూడా చెప్పింది. అవన్నీ యిప్పుడు ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి. వీళ్లు ఏం చెప్పినా ప్రభుత్వసాయంపై ఆధారపడిన సింహళ గ్రామీణ పేదలు రాజపక్షకే ఓటేశారు. సింహళీయుల్లో బౌద్ధులు, ధనికులు కూడా అతనికే ఓటేశారు. కొలంబోలోని నగరప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లోని జనాభా 2010లో రాజపక్షకు ఓటేయగా, యీసారి అతనికి వ్యతిరేకంగా వేశారు. ఎందుకంటే అక్కడ వున్నవారిలో సింహళ, తమిళ భాషల క్రైస్తవులు, తమిళ హిందువులు, ముస్లిములు ఎక్కువగా వున్నారు. సమాజంలోని విద్యావంతులు, ఎకడమీషియన్లు, కార్మికనాయకులు, లెఫ్టిస్టులు, కళాకారులు, హక్కుల ఉద్యమకారులు అందరూ ఎక్కడున్నా సరే రాజపక్షకు వ్యతిరేకమయ్యారు.  

రాజపక్ష ప్రచారంలో భాగంగా 26 ఏళ్ల పాటు తమిళ టైగర్ల వలన దేశం అంతర్యుద్ధంలో ఎలా నాశనమైందో గుర్తుకు తెచ్చుకోండి అంటూ రేడియో, టీవీ స్లాట్‌ల ద్వారా మోగించేశారు. రాజపక్ష కారణంగానే శాంతి నెలకొంది, అతన్ని దింపేస్తే మళ్లీ అశాంతే అనే అర్థంలో తమిళ, సింహళ, ఇంగ్లీషు భాషలో పత్రికలలో యాడ్స్‌ గుప్పించారు. మైత్రీపాలను 'ఈలమిస్టు'గా 'ఎలిట్‌' (కులీనవర్గాల) ప్రతినిథిగా చూపిస్తూ తనను గ్రామీణ ప్రాంతాల ఛాంపియన్‌గా చిత్రీకరించుకున్నాడు. జాతిపరమైన మైనారిటీలు మొత్తం 22% మందే వున్నారు కాబట్టి, యీ రకమైన విభజన ద్వారా మెజారిటీ ప్రజల మద్దతుతో తను గెలవవచ్చని అతని లెక్క. కానీ అది తప్పింది. మైత్రీసేన నెగ్గాడు. ఇప్పుడు మైత్రీసేన ముందున్న సవాళ్లేమిటో చూద్దాం. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 19-Feb-2015 22:00:00 GMT

Wednesday, February 18, 2015

ఎమ్బీయస్‌: శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన- 3

చంద్రికా కుమారతుంగ తండ్రి సోల్మన్‌ బండారనాయకేయే 1951లో శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) ని స్థాపించినది! స్వాతంత్య్రానంతరం ప్రధాన భూమిక వహించిన రెండు పార్టీలలో యిది ఒకటి. దీని సిద్ధాంతాలు సోషలిజానికి దగ్గరగా వుండగా దీని ప్రత్యర్థి యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)  సెంటర్‌-రైటిస్టు పాలసీని అవలంబించేది. సోల్మన్‌ 1956లో దేశానికి ప్రధానిగా ఎన్నికై మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యాడు. అప్పుడు చంద్రిక తల్లి సిరిమావో పార్టీ పగ్గాలు చేతబట్టి 1960లో ప్రధానమంత్రి అయింది. వామపక్ష, ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజలను ఆకట్టుకుంది. తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడి చెడ్డపేరూ తెచ్చుకుంది. 1977లో పదవీభ్రష్టురాలై జయవర్ధనే చేతిలో ఓడిపోయింది. చంద్రిక పారిస్‌లో చదువుకుంది. 1974లో శ్రీలంకకు తిరిగి వచ్చి పార్టీలో చేరి మహిళా విభాగంలో చురుగ్గా పనిచేసింది. ఒక సినిమా యాక్టరును పెళ్లాడి, తల్లి పార్టీని విడిచి అతని పార్టీలో చేరింది. అయితే అతను కూడా హత్యకు గురి కావడంతో ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడే చాలాకాలం వుంది. 1991లో తిరిగి వచ్చి పార్టీకి పునర్వైభవం కలిగేట్లా చేసింది.  

ఆమె తల్లి చాలా కుటిలత్వం ప్రదర్శించింది. కొడుకు అనూరకు, కూతురు చంద్రికకు మధ్య పోటీ పెట్టి పార్టీని తన అదుపులో వుంచుకోవాలని చూసింది. ముగ్గురిలో చంద్రిక తెలివితేటలు ప్రదర్శించి పీపుల్స్‌ ఎలయన్స్‌ పేర ఒక కూటమిని కూర్చి యుఎన్‌పి 16 ఏళ్ల పాలనను అంతం చేసి 1994లో అధ్యక్షురాలిగా ఎన్నికైంది. తల్లిని వూరికే వదిలేస్తే ప్రమాదమని 1994లో ప్రధానమంత్రిని చేసింది. ఆమె ఆరేళ్లు ఆ పదవిలోనే వుంది. చంద్రిక తమిళటైగర్లతో సంధియత్నాలు చేసింది, అవి విఫలం కావడంతో వారిపై మిలటరీని ప్రయోగించింది. టైగర్లు 1999 ఎన్నికల సమయంలో చేసిన ఒక దాడిలో ఆమె ఒక కన్ను పోయింది. ఆ ఎన్నికలలో సింపతీ ఓటుతో ఆమె యుఎన్‌పి తరఫు అభ్యర్థి రానిల్‌ విక్రమసింఘేను ఓడించి మళ్లీ అధ్యక్షురాలైంది. 2001 డిసెంబరులో ఆమె ప్రత్యర్థి రానిల్‌ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అతను టైగర్లతో శాంతి చర్చలు మొదలుపెట్టాడు. ఆ మెతకవైఖరి చంద్రికకు నచ్చలేదు. అతను 2003 నవంబరులో అమెరికా వెళ్లినపుడు పార్లమెంటును ప్రొరోగ్‌ చేసి అతని అధికారాలు లాక్కుంది. వామపక్ష పార్టీ అయిన జనతా విముక్తి పెరమున, యింకా యితర పార్టీలతో కలిసి యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడమ్‌ ఎలయన్స్‌ (యుపిఎఫ్‌ఏ) అనే మరింత పెద్ద కూటమిని కూర్చి, దాని ద్వారా రాజపక్షను ప్రధానమంత్రిని చేసింది.  

అయితే 2005 కల్లా పెరమున విడిపోయింది. అప్పటితో చంద్రిక అధ్యక్షపదవి కూడా సమాప్తమైంది. ఆవిడ యింకా కొనసాగాలని చూసింది కానీ రాజపక్ష అడ్డుపడ్డాడు. కూటమిలోని 25 పార్టీలు - ఎస్‌ఎల్‌ఎఫ్‌పితో సహా - అతనికి అండగా నిలిచాయి. చంద్రిక సొంత పార్టీలోనే బలహీనపడింది. అధికారంలో వుండగా చంద్రిక తన తల్లి పద్ధతులకు వ్యతిరేకంగా గ్లోబలైజేషన్‌వైపే మొగ్గింది. ఉదార ఆర్థికవిధానాలు అవలంబించి ధనిక, పేద వ్యత్యాసానికి దోహదపడింది. అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. చంద్రిక స్థానంలో ఆమె సోదరుడు అనూరకు బదులుగా పార్టీ నేతలు రాజపక్షను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. అనూర కోపంతో యుఎన్‌పిలో చేరాడు. రాజపక్ష ఎన్నికల్లో నెగ్గి తమిళ టైగర్లను మట్టుపెట్టి తన బలాన్ని పెంచుకున్నాడు. తన నేతృత్వంలోని యుపిఎఫ్‌ఏ కూటమిలో 14 పార్టీలుండడంతో పోనుపోను చంద్రికను లక్ష్యపెట్టడం మానేశాడు.  పరాజయభారంతో కుములుతున్న చంద్రిక రాజపక్షపై కక్ష తీర్చుకోవాలనుకుంది. ఇన్నాళ్లకు అవకాశం రావడంతో ఎవరికీ తెలియకుండా వ్యూహరచన చేసింది. రాజపక్ష మంత్రివర్గంలో అసంతృప్తి రగులుతున్నట్లు కనిపెట్టిందామె. కొత్తగా పార్టీలో చేరి, రాజపక్షకు సన్నిహితులుగా మారి అవినీతికి పాల్పడుతున్నవారిపై చాలాకాలంగా వున్న అతని సహచరులకు అసూయగా వుంది. ఎదిరించి బయటకు వస్తే వేధింపులకు గురవుతామోనని భయపడుతున్నారు. రాజపక్ష సోదరులు యిప్పుడున్నదానితో సంతృప్తి పడకుండా యింకా పెద్దపెద్ద ప్లాన్లు వేస్తున్నారని వారికి తెలుసు, అతని కొడుకు వచ్చేసారి అధ్యక్ష అభ్యర్థి అని తెలుసు. ఇక వారి వంశం శ్రీలంకను ఎల్లకాలం పాలించడానికి సిద్ధపడుతోందని, ఇంకో 8 ఏళ్ల పాటు సాగబోయే పాలనలో తాము మరింతగా నామమాత్రు లవుతామనీ భయపడ్డారు. రాజపక్షకు అడ్డుకట్ట వేసి తీరాల్సిందే, కానీ ఎలా? తమకు బలం చాలదే అని మథన పడుతున్నట్లు చంద్రికకు తెలిసింది.  

రాజపక్ష వేలితో అతని కన్నునే పొడవాలనే ప్రణాళికతో అతని పార్టీలోనే అతనికి కుడిభుజంగా, అతని కాబినెట్‌లో ఆరోగ్యమంత్రిగా వున్న మైత్రీపాలను దువ్వింది. అతనికి మద్దతు పలకమని తనకు బద్ధశత్రువుగా వున్న యుఎన్‌పి నాయకుడు రానిల్‌ను కూడా అర్థించింది. ఈ కసరత్తు కొన్ని వారాలపాటు జరిగింది. ఆమె యింట్లోనే ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యేవారు. సమావేశాల గురించి సమాచారం అందించుకోవడానికి మామూలు ఫోన్లు వుపయోగిస్తే ప్రభుత్వ యింటెలిజెన్సు వర్గాలు పసిగడతాయనే భయంతో వారికి చిక్కకుండా వుండేందుకు ఎన్‌క్రిప్టెడ్‌ శాటిలైట్‌ ఫోన్లను ఉపయోగించారు. గత ఎన్నికలలో రాజపక్ష చేతిలో ఓడిపోయిన మాజీ ఆర్మీ చీఫ్‌ శరత్‌ ఫోనెస్కా వీరికి యిలాటి విషయాల్లో సాయపడ్డాడు. అనేక మంది డమ్మీ కాండిడేట్లను అభ్యర్థులుగా నిలిపి రాజపక్షను కన్‌ఫ్యూజ్‌ చేసి, అతనికి ఎన్నికలంటే నల్లేరుపై బండి నడక అనే అభిప్రాయం కల్పించారు.   

ప్రతిపక్షాల తరఫున ఎవరు సరైన అభ్యర్థి అని గాలిస్తే అనేక పేర్లు చర్చకు వచ్చాయి - చంద్రిక, యుఎన్‌పి సభ్యులు రానిల్‌ విక్రమసింఘే, కారూ జయసూర్య, నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ లీడరు జస్టిస్‌ మధులోలువె సొబితా, చీఫ్‌ జస్టిస్‌ శిరాణీ బండార్‌ నాయకే.. యిలా. చివరకు మైత్రీపాల సరైన అభ్యర్థి అని అందరూ అభిప్రాయపడ్డారు. మైత్రీపాల ఎస్‌ఎల్‌ఎఫ్‌పికి జనరల్‌ సెక్రటరీ, ఆరోగ్యమంత్రి. తమిళ టైగర్లతో పోరాడిన ఖ్యాతి రాజపక్షకు వున్నట్లే మైత్రీపాలకు కూడా వుంది. అతనిపై 2008లో టైగర్లు దాడి చేస్తే అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. యుద్ధం అంత్యథలో అంటే 2009లో అతను తాత్కాలికంగా డిఫెన్సు మినిస్టర్‌గా పనిచేశాడు. రాజపక్ష లాగా అతనూ సింహళ బౌద్ధుడు. గ్రామీణ ప్రాంతీయుడు. మధ్యతరగతి రైతు కుటుంబంలో 12 మంది పిల్లల్లో ఒకడిగా పెరిగాడు. స్థానికంగా చదువుకునే రోజుల్లో చైనాకు అనుకూలంగా వుండే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ సిలోన్‌లో సభ్యుడిగా వున్నాడు. కానీ తర్వాత ఎస్‌ఎల్‌ఎఫ్‌పి యూత్‌ వింగ్‌లో చేరాడు. 1971 నాటికి యూత్‌వింగ్‌ మాతృసంస్థపై తిరగబడినపుడు యితను కూడా తిరుగుబాటుదారుల్లో ఒకడు. 15 నెలలపాటు జైలు జీవితం అనుభవించాడు. 1989లో ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టాడు. 1994లో అతని పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అతన్ని యిరిగేషన్‌ శాఖలో డిప్యూటీ మినిస్టర్‌గా వేశారు. తర్వాతి రోజుల్లో వ్యవసాయమంత్రిగా, ఆరోగ్యమంత్రిగా కూడా చేశాడు. రాజపక్షలో రాజరికపు పోకడలున్నాయి. వాణిజ్యవర్గాలతో స్నేహం వుంది. అత్యాశ వుంది. మైత్రీపాల పదవుల కోసం పాకులాడ లేదు. పైగా మృదుస్వభావి. మంత్రి అయినా గ్రామీణ పోకడలు విడిచిపెట్టలేదు. ఈ విధంగా రాజపక్ష లాటి నేపథ్యమే కలిగి వుండి, యుఎన్‌పి ఆమోదయోగ్యుడయ్యే అరుదైన వ్యక్తి యితనే అని తేల్చారు. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 17-Feb-2015 22:00:00 GMT

Tuesday, February 17, 2015

ఎమ్బీయస్‌ : సౌదీ అరేబియాలో రాజు మారారు

సౌదీ అరేబియా పాలకుడు అబ్దుల్లా బిన్‌ అబ్దులజీజ్‌ జనవరి 23 న చనిపోయారు. అరబ్‌ ప్రాంతంలో అమెరికాకు చిరకాలమిత్రుడైన అబ్దుల్లా అంత్యక్రియలకు హాజరు కావడానికై ఒబామా తన భారతదేశ పర్యటనను కుదించుకోవలసి వచ్చింది. సౌదీ ఆచారం ప్రకారం అంత్యక్రియలు అతి నిరాడంబరంగా జరిగాయి. శవాన్ని ఒక గుడ్డలో చుట్టి కుటుంబసభ్యులు మోయగా, శవపేటిక కూడా లేకుండా గుర్తు పట్టలేని ఒక చోట కప్పిపెట్టారు. అక్కడ సమాధి కట్టడం లాటివి ఏవీ చేయరు.    లెక్కప్రకారం చూస్తే 2005 నుంచే అబ్దుల్లా రాజుగా వ్యవహరించారు. కానీ అంతకు పదేళ్ల ముందు నుంచే అతను తెర వెనుక నుండి అధికారం చలాయిస్తున్నాడు. అప్పటి రాజు ఫహద్‌ యితని సవతి సోదరుడే. ఇతను అప్పుడు యువరాజు. సౌదీ అరేబియా రాజ్యాన్ని స్థాపించిన ఇబ్న్‌ సౌద్‌ 1953లో చనిపోయాక, అతని కుమారులే ఒకరి తర్వాత మరొకరు రాజులవుతూ వస్తున్నారు. అబ్దుల్లా స్థానంలో యిప్పటిదాకా యువరాజుగా వున్న ఆయన సోదరుడు సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ సౌద్‌ కొత్తరాజు అయ్యారు. వయసు 70. వీళ్లందరూ సోదరులేనా అని ఆశ్చర్యపడవద్దు. వాళ్లు మొత్తం 53 మంది బ్రదర్స్‌! (ఇంతమంది పిల్లలకు పేర్లు వెతకడం కూడా కష్టమే కదా) ఈ సోదరులందరూ కలిసి వారసులెవరో నిర్ణయిస్తారన్నమాట. అందరి కంటె చిన్నవాడు 68 ఏళ్ల ముక్రీన్‌ను యువరాజు చేస్తూ కొత్తగా యువరాజుకి డిప్యూటీ (బాలరాజు అనాలేమో)ను కూడా నియమించాలని నిశ్చయించారు. అతను హోం మంత్రిగా పని చేస్తూ అల్‌ ఖైదాతో పోరాటం సాగిస్తున్న మహమ్మద్‌ బిన్‌ నయ్యీఫ్‌. ఇతను సౌద్‌కు కొడుకు కాదు, మనుమడు. ఈ మార్పుల వలన సౌదీ విధానాలు ఏమైనా మారతాయా అనేది ఆసక్తికరమైన అంశం. 

అబ్దుల్లాకు లిబియా అధినేత కల్నల్‌ గడ్డాఫీ అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి అరబ్‌ లీగ్‌ సమావేశంలో అబ్దుల్లా గడ్డాఫీపై అరబిక్‌ భాషలో బూతులు కురిపించాడట. అమెరికా సాయంతో గడ్డాఫీని ఎలా అంతం చేశాడో చూశాం. ప్రస్తుతం సిరియా పాలకులపై కక్ష కట్టాడు. అంతకుముందు ఐయస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌)ను అణచాలని అమెరికా మిలటరీ కూటమి ఏర్పరచి సౌదీని భాగస్వామిగా చేసింది. అలాటి కూటమే మరొకటి ఏర్పరచి సిరియా పని పట్టాలని అబ్దుల్లా కోరుతూ వచ్చాడు. 2013లో  సిరియాపై దాడి చేయడానికి అమెరికా, సౌదీ, ఫ్రెంచ్‌ విమానాలు రెడీగా వున్న తరుణంలో ఆఖరి నిమిషంలో దాడి వద్దని అన్నందుకు ఒబామాను అబ్దుల్లా క్షమించలేదు. కొన్నాళ్లు పోయాక సిరియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వారి సహకారంతో సిరియాలో వున్న ఐయస్‌ స్థావరాలపై దాడిచేశారు. కానీ అది అబ్దుల్లాను సంతృప్తి పరచలేదు.  

అబ్దుల్లాకు ఈజిప్టు అధ్యక్షుడుగా వున్న హోస్నీ ముబారక్‌ అంటే అభిమానం వుంది. ఈజిప్టులో విప్లవం చెలరేగి, అతన్ని కిందకు దింపేస్తూ వుంటే వేడుక చూస్తూ కూర్చుందని అమెరికాపై కినుక. హోస్నీ పతనం తర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు బలం పెరిగి, ఆ ప్రాంతంలో బలం పుంజుకోవడం, అరబ్‌లో కల్లా పెద్ద దేశమైన ఈజిప్టులో ప్రజాస్వామ్యం కోసం డిమాండ్‌ రావడం - యివన్నీ చూశాక అబ్దుల్లాకు గుబులు ప్రారంభమై కినుక కోపంగా మారింది. అరబ్‌ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఛాయలు పడకూడదన్న ఆదుర్దాతో ఈజిప్టులోని మిలటరీ ప్రభుత్వానికి ఆర్థికసాయం, నైతిక సాయం చేశాడు. అంతేకాదు, గల్ఫ్‌లోని యితర అరబ్‌ దేశాల నేతలను కూడా ఒప్పించి ఈజిప్టు ప్రజాస్వామ్యంవైపు వెళ్లకుండా మిలటరీకి మద్దతిచ్చేట్లా చేశాడు. అరబ్‌ ప్రజలెప్పుడూ రాజులకు సలాంలు చేస్తూనే వుండాలని అబ్దుల్లా కోరిక. వీళ్లు సున్నీలు. వీళ్ల రాజ్యంలో 15% వున్న షియాలు తమ పట్ల వివక్షత చూపుతున్నారని భావిస్తూ వుంటారు. బహరైన్‌లో రాజు కూడా సున్నీ, కానీ ప్రజల్లో షియాలకు సంఖ్యాబలం వుంది. వాళ్లు ఎన్నికలు కావాలంటూ, ప్రభుత్వంలో ప్రజలకు ప్రాతినిథ్యం వుండాలంటూ 2012, 2013లలో ఉద్యమాలు చేపడితే బహరైన్‌ రాజు అబ్దుల్లా సాయం అర్థించాడు. అబ్దుల్లా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కలిసి 'శాంతిసేన'ను పంపించి, ఉద్యమాన్ని అణచివేశారు. ఇప్పటికీ ఆ సేన అక్కడే వుంది.  

అబ్దుల్లాకు నచ్చని మరో దేశం షియాలు ఎక్కువగా వున్న ఇరాన్‌! బహరైన్‌, ఇరాన్‌. యెమెన్‌, లెబనాన్‌ - ఎక్కడ గొడవ జరిగినా ఇరానే వెనక నుంచి చేయిస్తోందని అతని అనుమానం. సిరియాలో ప్రభుత్వాన్ని మార్చేసి తన చెప్పుచేతల్లో వుండేవారిని నెలకొల్పాలనే అబ్దుల్లా కోరిక ఇరాన్‌, రష్యాలు సిరియాకు మద్దతు యివ్వడం చేత నెరవేరటం లేదు పాపం. తమ మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని ఇరాన్‌ ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ అబ్దుల్లా స్పందించలేదు. ఇరాన్‌-అమెరికాల మధ్య అణు ఒప్పందానికి ఇజ్రాయేలు ఎంత వ్యతిరేకో, అబ్దుల్లా కూడా అంతే వ్యతిరేకి. సౌదీ రాజకుటుంబానికి రాజగురువులైన వహాబీ మతపెద్దల ప్రకారం షియాలు ఇస్లాం మతవిశ్వాసరహితులు. హసన్‌ వహాబ్‌ అనే మతగురువు 19 వ శతాబ్దపు చివరిలో వుండేవాడు. ఆయన కూతుళ్లలో ఒకరిని ఇబ్న్‌ సౌద్‌ పెళ్లాడి, ఆ మతపీఠంతో చేతులు కలిపాడు. సౌదీ రాజుల మద్దతుతో యీ గురువులు అరబ్‌ ప్రాంతమంతా పర్యటిస్తూ, తమ ప్రబోధాలతో ఇరాన్‌, ఇరాక్‌, సిరియా వంటి ప్రాంతాల్లో సున్నీ-షియా విభేదాలను రెచ్చగొడుతున్నారు. సిరియాను అల్లకల్లోలం చేయడానికి చూస్తున్న ఐయస్‌ సౌదీ తరహా పుస్తకాలను తమ అధీనంలో వున్న స్కూళ్లలో చదివిస్తోంది. ఇరాన్‌ బలపడితే సౌదీలో వున్న షియాలకు ధైర్యం వస్తుందని సౌదీ రాజుల భయం. 

ఆర్థికపరమైన అంశాలకు వస్తే - సౌదీ వైభవానికి కారణం ప్రపంచంలో కల్లా క్రూడ్‌ ఆయిల్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశమది. తన ఉత్పత్తిని పెంచో, తగ్గించో ప్రపంచంలో ఆయిల్‌ ధరలను నియంత్రించ శక్తి గలది. గత ఏడాదిగా ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. లెక్క ప్రకారం చూస్తే సౌదీ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గించి డిమాండ్‌, ధర పడిపోకుండా, తాము నష్టపోకుండా చూసుకోవాలి. కానీ సౌదీ ఉత్పత్తి తగ్గించటమే లేదు, ఆయిల్‌ ధర యింకాయింకా పడిపోతున్నా సరే! దీని వెనక రాజకీయ కారణాలున్నాయి. సిరియాను వశపరచుకోవాలంటే దానికి మద్దతిస్తున్న ఇరాన్‌, రష్యాలను ఎలాగోలా దెబ్బ కొట్టాలి. ముందుగా రష్యాపై సామోపాయం ప్రయోగించి చూశాడు. 2014లో 'మీ వద్ద బిలియన్ల డాలర్ల ఆయుధాలు కొంటాం, సిరియాకు మద్దతు యివ్వడం మానేయండి' అన్నాడు. దానికీ, దీనికీ లింకు పెట్టవద్దు, దేనికదే అన్నారు రష్యావారు. రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బ కొట్టాలంటే ఆయిల్‌ ధర పెరక్కుండా చూడాలి అనుకున్నాడు. అదే రీతిలో ఆయిల్‌ ఉత్పత్తి చేసే మరో దేశమైన ఇరాన్‌ను కూడా దెబ్బ కొట్టాలంటే యిదే మంత్రం అనుకున్నాడు. పాత స్థాయిలోనే ఆయిల్‌ ఉత్పత్తి చేస్తూనే వున్నాడు. గత ఏడాది 100 డాలర్లు వున్న బారెల్‌, యిప్పుడు 50 డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌, రష్యా విలవిల్లాడుతున్నాయి. అమెరికా ఆయిల్‌ ఇండస్ట్రీకి కూడా దీని వలన దెబ్బ తగిలింది. అయినా దానికి సంతోషమేమిటంటే ఆయిల్‌ ఎగుమతులపై ఆధారపడిన వెనిజులా వామపక్ష ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలో యిరుక్కుంది. ఆయిల్‌ ధరల తగ్గుదల వలన సౌదీ కూడా ప్రభావితమైంది. 2015 బజెట్‌లో 38.6 బిలియన్‌ డాలర్ల లోటు కనబడుతోంది. కానీ దానికి 750 బిలియన్‌ డాలర్ల రిజర్వ్‌స్‌ వున్నాయి కాబట్టి ధీమాగా వుంది. కొత్త రాజు యీ పాలసీని మార్చేస్తాడని అనుకోలేం కానీ, రాచకుటుంబంలోని పిన్నవయస్కులు ఎందుకొచ్చిన గోల యిది అనుకుంటున్నారట.  

2010లో అమెరికా ఆర్థికపరిస్థితి అతలాకుతలమైనపుడు అమెరికాతో ముడివేసుకున్న సౌదీ అరేబియాలో కూడా నిరుద్యోగం ప్రబలింది. అబ్దుల్లా 384 బిలియన్‌ డాలర్లతో పంచవర్ష అభివృద్ధి ప్రణాళిక ప్రవేశపెట్టాడు. అయినా జనాభాలో సగం మంది 25 ఏళ్ల వయసు కంటె తక్కువ వాళ్లే కాబట్టి యిప్పటికీ నిరుద్యోగ సమస్య తీరలేదు. నిరుద్యోగ భృతి కింద డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది. రాజకీయ పరమైన సంస్కరణల విషయంలో అబ్దుల్లా కొద్దిపాటి మార్పులు చేశాడు. మహిళలు వాహనాలు నడపకూడదు కానీ మునిసిపల్‌ ఎన్నికలలో ఓటు వేయవచ్చు. ఆ బూతులపై నిఘా వుంటుందనుకోండి.  ఒక హద్దు వరకు మీడియా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అలా అంటూనే హక్కుల ఉద్యమకారులను, రాజకీయ ఉద్యమకారులను జైళ్లలో పెట్టారు. ప్రభుత్వం పాటిస్తున్న మతఛాందసత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వెబ్‌సైట్‌ పెట్టినందుకు రయీఫ్‌ బద్వాయీ అనే సౌదీ పౌరుడికి వెయ్యి కొరడా దెబ్బల శిక్ష విధించారు. మహిళలకు మరిన్ని హక్కులు కావాలని కోరిన ఒక షియా మతస్తుడికి గత అక్టోబరులో స్పెషల్‌ కోర్టు 'రాజధిక్కారం' నేరంపై మరణశిక్ష విధించింది. అంతర్జాతీయంగా నిరసన వెలువడడంతో మరణశిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచారు. సౌదీ అరేబియాలో రాజు మారవచ్చు కానీ రాజరికపు పోకడలు ఎక్కడకు పోతాయి? ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకులం, జీతం లేకుండా పోలీసు ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పుకునే అమెరికా యిలాటివారికి వత్తాసు యిస్తూ వుంటుంది. దాని అండతో వీళ్లు ప్రజల హక్కులను కాలరాస్తూనే వుంటారు. 
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 2

సామాన్యప్రజలు ఏమనుకున్నా పట్టించుకోనక్కరలేదని, ఎందుకంటే రాజకీయంగా తనతో తలపడగల మొనగాడే లేడని తలపోసిన రాజపక్ష యీ వూపులోనే మూడోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయిపోతే ఎప్పటికీ ఎదురు వుండదనుకుని, ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. 2013 జనవరిలో తనకు వ్యతిరేకంగా తీర్పు యిచ్చిన చీఫ్‌ జస్టిస్‌ శిరాణీ బండారునాయకేను రాజపక్ష పదవి నుంచి తొలగించాడు. దాంతో మధులోలువె సొబితా అనే బౌద్ధసన్యాసి నేతృత్వంలో ప్రజాహక్కుల ఉద్యమం మొదలైంది. ఆయన అందరి పట్ల నిష్పక్షపాతంగా వుంటాడన్న పేరు వుంది కాబట్టి ఏడాది తిరిగేసరికి సమాజంలోని అనేక వర్గాలు దానిలో చేరి ఆందోళన చేయసాగాయి. అది బలపడుతూండడం కూడా రాజపక్ష ముందస్తు ఎన్నికలు ప్రకటించడానికి ఒక కారణం అంటారు.  

1987 నాటి భారత-శ్రీలంక ఒప్పందం ప్రకారం ప్రాంతీయ కౌన్సిళ్లకు పోలీసు, భూమిపై అధికారాలు కట్టబెట్టాలి. రాజ్యాంగంలో ఆ విషయమై 13 వ సవరణ చేసినప్పటికి దాన్ని అమలు చేయడంలో విపరీతమైన జాప్యం జరిగింది. తమిళ ప్రాంతాలలో టైగర్ల ప్రాబల్యం వుండగా దాన్ని ఆలస్యం చేయడం సహజమేననుకుని భారత్‌ వేచి వుంది. 2009 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని శ్రీలంక ప్రభుత్వమే చెపుతున్నపుడు మరి ఆ సవరణ చేయడానికి యింకేమిటి ఆలస్యం? అని ఇండియా ఫీలైంది. తమిళ ప్రాంతాల్లో ఎన్నికలు జరిపినా అక్కడి కౌన్సిళ్లకు అధికారాలు యివ్వకపోవడంతో అవి మునిసిపాలిటీల్లాగే వున్నాయి. యుద్ధం ముగిసిపోయినా అక్కణ్నుంచి మిలటరీని ఉపసంహరించలేదు. యుద్ధసమయంలో ఆక్రమించిన యిళ్లు, పొలాలు మిలటరీ అధీనంలోనే వుండిపోయాయి. పైగా మరి కొన్ని స్థలాలు తీసుకుని కొత్తగా మిలటరీ స్థావరాలు కట్టారు. యుద్ధనేరాలపై విచారణ జరిపిస్తానంటూనే జరిపించకపోవడంతో యునైటెడ్‌ నేషన్స్‌లో హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ 2012, 2013లో రాజపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినపుడు అమెరికాతో బాటు ఇండియా కూడా దాన్ని సమర్థించింది. అయితే చైనా వీటో చక్రం వేసి రాజపక్షను కాపాడింది.  

అప్పుడు యిండియాలో యుపిఏ ప్రభుత్వం వుంది. డిఎంకె ఒత్తిళ్లకు లొంగి, తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలపై పట్టుబట్టదని రాజపక్ష ఆశ పెట్టుకున్నాడు. అయితే రాజపక్షతో జరిగిన తన తొలి సమావేశంలోనే మోదీ 13 వ సవరణ అమలు గురించి ఏమైందని అడగడంతో దిగ్భ్రాంతి చెందాడు. దానికి ఫాలోఅప్‌ అన్నట్లు ఉత్తర ప్రాంతంలో కౌన్సిల్‌ను పాలిస్తున్న తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ (టిఎన్‌ఏ) పార్టీ నాయకులు 2014 ఆగస్టులో రాజపక్షను కలిసి అమలు చేయమని కోరారు. రాజపక్షకు కోపం వచ్చింది. నెల తిరక్కుండా చైనీస్‌ సబ్‌మెరైన్లను కొలంబో హార్బర్‌లో డాక్‌ చేయడానికి తొలిసారి అనుమతించాడు. ఆ మరుసటి నెలలో అంటే అక్టోబరులో చైనా అధ్యక్షుడు ఇండియా, శ్రీలంక పర్యటనకు వచ్చినపుడు రెండోసారీ అనుమతించాడు. ఈ వరస చూసి రాజపక్షకు బుద్ధి గరపడానికి శ్రీలంక ఎన్నికలలో ఇండియా ప్రతిపక్షాలకు పరోక్షంగా సహాయం అందించిందని వినికిడి.  

రాజపక్ష  ప్రజలను వర్గాలుగా విడదీసి, కొందర్ని మచ్చిక చేసుకున్నాడు. తను లేకపోతే శ్రీలంక విచ్ఛిన్నమై పోయేదనే భావనను సింహళీయుల్లో కలిగించడానికి మీడియాను వాడాడు. తన గురించి గొప్పగా రాయడానికి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడడానికి  ప్రభుత్వం చేతిలో వున్న మీడియాను వుపయోగించుకున్నాడు.   హోటళ్లు, బ్యాంకింగ్‌, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో తన స్నేహితులకు బాగా అవకాశాలు కల్పించి వారి ద్వారా మీడియాను లోబరుచుకోవడానికి, లొంగని చోట బెదిరించడానికి వుపయోగించుకున్నాడు. అనేక ప్రయివేటు మీడియా సంస్థలు ప్రభుత్వ లైసెన్సులకోసం, యాడ్‌లపై ఆదాయం కోసం అమ్ముడుపోయాయి. కొందరు పాత్రికేయులు స్వతంత్రంగా వ్యవహరించబోయారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేయించాడు. ఇలాటి వేధింపులు తట్టుకోలేక కొందరు జర్నలిస్టులు విదేశాలకు పారిపోయారు.  

రాజపక్ష చేస్తున్న యీ పనులు పట్టణప్రాంతాల వారు, విద్యావంతులు ఏవగించుకున్నారు. అయినా సింహళ ప్రజలు తన పక్షానే వున్నారని రాజపక్ష గర్వం. ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)కి అధ్యక్షుడైన రానిల్‌ విక్రమ్‌సింఘే సింహళ ఓట్లను తననుంచి గుంజుకోలేడని అతనికి తెలుసు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపి తనను ఓడించే అవకాశం లేదని తెలిసి, యిదే అదనని ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. దానికి నెల ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్టోబరులో ప్రకటించిన బజెట్‌లో సబ్సిడీలు పెంచుతానని, వాటర్‌ సప్లయి ప్రాజెక్టులు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులలో ఎక్కువ పెట్టుబడులు పెడతానని, పన్నులు తగ్గిస్తానని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని హామీలు గుప్పించాడు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల జీతాలు పెంచాడు. ప్రయివేటు సెక్టార్‌ ఉద్యోగులకు యిచ్చే రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మెరుగుపరిచాడు. పోలీసు అధికారులకు, ఉద్యోగులకు మోటారు సైకిళ్లు, స్కూటర్లు నామమాత్రపు ధరలకు అందించాడు. వరికి, పాల ఉత్పాదనలకు, రబ్బరుకు మద్దతు ధర పెంచాడు. హైస్కూలు విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, సీనియర్‌ సిటిజన్లకు, వికలాంగులకు, కిడ్నీ రోగులకు, మిలటరీ కుటుంబాలకు అలవెన్సులు పెంచాడు. నీరు, విద్యుత్‌ చార్జీలు, ఆదాయపు పన్ను రేట్లు తగ్గించాడు. ఇన్ని చిట్కాలు ప్రయోగించినా చివరకు ఓటమి తప్పలేదు. దానికి కారణం - గడ్డిపోచల్లా విడివిడిగా పడి వున్న ప్రతిపక్షాలు వెంటిగా ఏర్పడి రాజపక్ష అనే మత్తగజాన్ని బంధించడమే! వారిని అలా సంఘటితం చేసిన వ్యక్తి రాజపక్ష పార్టీకే చెందిన చంద్రికా కుమారతుంగ! (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 1

శ్రీలంకకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రీపాల సిరిసేన ఫిబ్రవరి 16 న భారతదేశం రాబోతున్నారు. ఇది అతని మొదటి విదేశీ పర్యటన. రాజపక్ష చైనాకు అనుకూలంగా వ్యవహరించగా, సిరిసేన భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆశ పొడచూపుతోంది. అనూహ్యంగా 69 ఏళ్ల మహీంద్ర రాజపక్షను ఎన్నికలలో ఓడించిన సిరిసేన తను అనుకున్నది సాధించగలడా లేదాని వూహించేముందు శ్రీలంక ప్రస్తుత రాజకీయాలను ఒక్కసారి మననం చేసుకోవాలి.  

ఎల్‌టిటిఇని మట్టుపెట్టి, శ్రీలంకలో శాంతిని స్థాపించిన రాజపక్షకు యిప్పట్లో ఎదురు వుంటుందని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా రాజపక్ష! అందుకే గడువుకు రెండేళ్ల ముందుగానే ఎన్నికలు జరుపుతామని నవంబరు 2014లో ప్రకటించి 2015 జనవరి 8 నాటి ఎన్నికలలో తన అధికారాన్ని తానే చేతులారా కూలదోసుకున్నాడు. గతంసారి దేశాధ్యక్షుడిగా వుంటూ 2009 మేలో తమిళ టైగర్లతో యుద్ధంలో గెలిచి, పౌరులందరూ అతన్ని పొగుడుతున్న తరుణంలో 2010లో అతను అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాడు. ఎవరూ ఎదురుచూడని విధంగా అతని ఆర్మీ కమాండర్‌ జనరల్‌ శరత్‌ ఫోన్సేకా అతనితో తలపడ్డాడు. ప్రజలు రాజపక్ష పక్షాన నిలిచారు. శరత్‌ ఓడిపోయాడు. విజితుడి పట్ల రాజపక్ష ఔదార్యం చూపలేదు. నాకే ఎదురుతిరుగుతావా, బుద్ధి చెప్తానుండు అన్నట్లు చిన్న చిన్న ఆరోపణలపై అతన్ని జైలుపాలు చేశాడు, అతనితో పాటు అతని సహచరులను కూడా! ఇదే అది అతని పతనానికి నాంది అంటారు పరిశీలకులు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్ల కంటె ఎక్కువసార్లు అధ్యక్షుడిగా వుండకూడదు. తన అధికారాన్ని ఉపయోగించి 2010లో ఆ షరతు ఎత్తేశాడు. సుప్రీం కోర్టు ఆ సవరణను ఆమోదించేట్లు చూసుకున్నాడు.  

మంత్రివర్గాన్ని, పాలనా యంత్రాంగాన్ని, న్యాయవ్యవస్థను, మిలటరీని తన బంధువులతో, అనుచరులతో నింపేశాడు. తనవాళ్లనే ఉన్నత పదవుల్లో నియమించుకున్నాడు. వాళ్ల పేర్లన్నీ రాస్తే కొండవీటి చాంతాడంత జాబితా తయారవుతుంది. శాంపిల్‌గా - తమ్ముడు గోటబయ డిఫెన్సు సెక్రటరీ, ఇంకో తమ్ముడు చమాల్‌ పార్లమెంటులో స్పీకరు, మరో తమ్ముడు బాసిల్‌ గంఫా జిల్లా నుంచి ఎంపీ. చమాల్‌ పెద్ద కొడుకు శశీంద్ర ఊవా ప్రాంతానికి మాజీ సిఎం. రెండో కొడుకు శమీంద్ర శ్రీలంక పోర్ట్‌స్‌ అథారిటీకి డైరక్టర్‌. బావగారు నిశాంత విక్రమసింఘే శ్రీలంక ఎయిర్‌లైన్సుకి చైర్మన్‌, బావమరిది లలిత్‌ చంద్రదాస రాజపక్ష ఆఫీసులోనే న్యూట్రిషన్‌ ప్రాజెక్టుకి నేషనల్‌ కోఆర్డినేటర్‌, కజిన్‌ ప్రసన్న విక్రమసూర్య ఎయిర్‌పోర్టు ఏవియేషన్‌ సర్వీసెస్‌కు చైర్మన్‌. ఇక రాజపక్ష పెద్ద కొడుకు నామల్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌ ఎంపీ, రెండో కొడుకు యోసిత కార్లటన్‌ స్పోర్ట్‌స్‌ నెట్‌వర్క్‌కు ఓనరు. ఇతర దేశాల్లో శ్రీలంక రాయబారులుగా నియమితులైన వారిలో చాలామంది అతని బంధువులో, స్నేహితులో! ఇప్పుడు రాజపక్ష హడావుడిగా ఎన్నికలు పెట్టి గెలిచేయాలని చూడడం దేనికంటే - 28 ఏళ్ల తన కొడుకు నామల్‌కి 2021 నాటికి 35 ఏళ్ల వయసు వచ్చి, అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత తెచ్చుకుంటాడనిట! ఇలా తన వంశమే ఎల్లకాలం పాలించాలని అనుకున్నాడు. వాళ్ల కుటుంబం విలాసాల్లో మునిగి తేలింది. లగ్జరీ కార్లు, విమానాలు, గుఱ్ఱాలు కొనడానికి ప్రభుత్వధనం వ్యయం చేసింది. ఇతర కాబినెట్‌ మంత్రులు అలంకారానికి మాత్రం మిగిలారు. గొంతెత్తి వ్యతిరేకత తెలుపుదామంటే రాజపక్ష తన సొంత పార్టీలోని యితర ప్రముఖులపై కూడా నిఘా వేసి వుంచాడు. తనను విమర్శించినవారిని వెంటాడి వేటాడాడు.   

మైనారిటీలలో, తమిళ ప్రాంతాలలో అతని పట్ల విముఖత పెరిగినకొద్దీ గ్రామీణ ప్రాంతాలలో, సింహళీయులలో, బౌద్ధులలో అతని పట్ల ఆరాధన కొనసాగింది. బోధు బల సేన అనే అతివాద బౌద్ధ సన్యాసుల సంఘం 2012లో ముస్లిములు, క్రైస్తవుల పట్ల దాడులు జరిపింది. కొలంబో ప్రాంతంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయి, బౌద్ధుల కంటె ఎక్కువ అయిపోతున్నారని దాని ఆందోళన. దానికి రాజపక్ష, అతని సోదరుడు గోటబయ మద్దతు వుంది. తమిళ టైగర్లను దునుమాడడంలో గోటబయ పాత్ర గణనీయమైనది. 2014 జూన్‌లో బలసేన ముస్లిం జనాభా అధికంగా వున్న బెరువల అనే పట్టణంపై దాడి చేసి అనేక ఆస్తులు ధ్వంసం చేసి నలుగుర్ని చంపేశారు. రాజపక్షకు మద్దతు యిస్తూ వస్తున్న ముస్లిం రాజకీయనాయకులు యీ దాడులకు నిరసన తెలిపి, నిందితులను అరెస్టు చేయాలని రాజపక్షను కోరారు. కానీ ఎవరూ అరెస్టు కాలేదు.  

ఆర్థికాభివృద్ధి 7% వుంది అని ప్రభుత్వం చెపుతున్నా శ్రీలంక ఆర్థికవేత్తలు అవన్నీ కిట్టించిన గణాంకాలు అంటున్నారు. రాజపక్ష పాలనలో ఉద్యోగాలు తగ్గాయి, జీతాలు తక్కువగా వున్నాయి. కానీ ప్రజలను ముగ్ధులను చేయడానికి పెద్ద పెద్ద మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు తలపెడితే అందరూ వూరుకుంటారని అతను తలపోశాడు. చైనా అండగా నిలిచింది. అధిక వడ్డీలపై బిలియన్ల డాలర్ల ఋణాలు యిచ్చింది. ప్రాజెక్టుల వలన ధనం ప్రవహించి కొంతమంది లాభపడ్డారు. వాటి దీర్ఘకాల ప్రయోజనం మాట ఎలా వున్నా ప్రస్తుతానికి మాత్రం అవి గుదిబండల్లా తయారయ్యాయి. ఎందుకంటే వడ్డీలు కట్టడానికి ఏటా వచ్చే ఆదాయమే సరిపోనంత భారీగా అప్పులు తీసుకున్నాడు రాజపక్ష. ఇంత పెద్ద ప్రాజెక్టులు అవసరమా, దీర్ఘకాలంలోనైనా ఆదాయం వస్తుందా, ఆర్థికంగా నిలబడుతుందా (ఎకనమిక్‌ వయబిలిటీ) లేదా, వడ్డీలైనా తీర్చగలమా లేదా అన్న లెక్కలేవీ వేయకుండా వీటిలో దిగాడు. కాంట్రాక్టులు యిచ్చేటప్పుడు అంతర్జాతీయ టెండర్లు పిలిచే పద్ధతి లేదు. ఇతరులతో పోల్చి చూసే పద్ధతి లేదు. (మన ఆంధ్ర రాజధాని బృహన్నిర్మాణపు ప్రణాళికల గురించి, సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టులన్నీ కట్టబెడుతున్న తీరు వలన భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి యిక్కడ గుర్తు చేయడం అప్రస్తుతం కాదు) అన్నీ చైనాకు కట్టపెట్టాడు. ఈ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన మంత్రిపదవులన్నీ రాజపక్ష బంధువుల వద్దే వున్నాయి. తన నియోజకవర్గపు ఓట్ల కోసం తన సొంత వూరిలో ఒక కొత్త ఎయిర్‌పోర్టు, కన్వెన్షన్‌ హాలు, ఎక్స్‌ప్రెస్‌ హైవే కట్టడానికి చైనానుండి ఋణం అర్థించాడతను. చైనా వాళ్ల దగ్గర కమిషన్‌ల కోసమే యీ ప్రాజెక్టులన్నీ అని, చివరకు ఆ అప్పులన్నీ తమ నెత్తిన పడతాయనీ శ్రీలంక ప్రజలు భావించారు. (సశేషం) 
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 16:59:30 GMT

Sunday, February 15, 2015

ఎమ్బీయస్‌ : మాంసభక్షణపై ఆంక్షలు

గుజరాత్‌లో శాకాహారులు రాజకీయంగా బలంగా వున్నారు. గోవధ నిషేధించడంతో వారు ఆగటం లేదు. ప్రతి బక్రీద్‌కు గోవులను చాటుగా వధిస్తున్నారన్న మిషపై గొడవలు చేస్తున్నారు. ఇది మమ్మల్ని సతాయించడమే తప్ప మరేమీ కాదని ముస్లిములు వాపోతున్నారు. గత ఏడాది నవరాత్రి సమయంలో ఎవరో కావాలని మక్కా ఫోటోలపై దుర్గ ఫోటోలు సూపర్‌ యింపోజ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. దాతీపై గుజరాత్‌లో అహ్మదాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో అల్లర్లు జరిగి కర్ఫ్యూ కూడా విధించవలసి వచ్చింది. ఈసారి దసరా, బక్రీద్‌ దగ్గరదగ్గర్లో వచ్చాయి కాబట్టి అలాటివి జరగకూడదనే ఆలోచనతో కొంతమంది పౌరులు హిందు, ముస్లిము ముఖ్యులతో శాంతి చర్చలు జరిపారు. ఏం చేసినా లాభం లేకపోయింది. బక్రీద్‌ సందర్భంగా గొఱ్ఱెలు, గేదెలు తీసుకున్న ట్రక్కులను ఆపి మీరు ఆవులను చాటుగా తీసుకెళుతున్నారు తనిఖీలు చేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ సభ్యులు యిబ్బంది పెట్టసాగారు. చెక్‌ చేయడానికి మీరెవరంటూ ముస్లిములు వాళ్లతో తగాదా పడ్డారు. దాహోద్‌, పంచమహల్‌ జిల్లాల్లో యిది మరీ తీవ్రంగా సాగింది. బరోడా వంటి నగరాలలో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి.  

''గోవధ గుజరాత్‌లో చట్టవిరుద్ధం కాబట్టి ఎవరూ అలాటి నేరానికి పాల్పడి పండగపూట జైలుపాలవడానికి చూడడు. మోదీ ముఖ్యమంత్రిగా వుండగా గోధ్రా అల్లర్ల తర్వాత కూడా యిలాటి గొడవలు రాలేదు. ఇప్పుడు పెచ్చు మీరాయి.'' అంటున్నారు ముస్లిములు. 'మోదీ హయాంలో విఎచ్‌పి, బజరంగ్‌దళ్‌లను అదుపులో వుంచాడు. ఇప్పుడు వాళ్లు రెచ్చిపోతున్నారు.' అంటున్నారు పరిశీలకులు. గుజరాత్‌ వాతావరణాన్ని బిజెపికి పట్టున్న తక్కిన ప్రాంతాలకు కూడా వ్యాపింపచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీ శివార్లలోని బవానా ప్రాంతంలో వున్న లక్షన్నర జనాభాలో 70% మంది ముస్లిములు. అక్కడ ఆవులను తెచ్చి దాచారంటూ 200 మంది యువకులు అక్టోబరు 2 గాంధీ జయంతిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ను వెంటపట్టుకుని చెకింగ్‌కు వచ్చారు. అక్కడ ఏ ఆవూ కనబడలేదు. మహేశ్‌ అనే అతను ఆవుతో కనబడితే అతన్ని చావగొట్టారు. నేను గొల్లవాణ్ని బాబోయ్‌, ఆవు నాదే అని గోలపెట్టాడతను. తమ ఆరోపణ నిజం చేయాలని ఆ యువకులు మర్నాటి రాత్రి రెండు ఆవులను కాలనీలో వదిలిపెట్టి రమ్మనమని ఒకణ్ని పంపించారు. ఇలాటిదేదో జరుగుతుందని ఊహించిన కాలనీవాసుల కమిటీ కాపు కాసి వాణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ విషయం తెలియక 'బవానాలో జరగబోయే సభకు రండి' అంటూ హిందూ క్రాంతికారీ సేన పేర మీద యిరుగుపొరుగు కాలనీలలో పోస్టర్లు వెలిశాయి. బిజెపి ఎమ్మెల్యే పవన్‌ శర్మ మేనల్లుడు ఆ సేన నిర్వాహకుల్లో ఒకడు. 

హిందువులకు గోవు పవిత్రమైనది కాబట్టి గోవధ నిషేధించాలని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఆందోళన జరుగుతూనే వుంది. వట్టిపోయిన ఆవులను, ముసలివై పోయిన ఎద్దులను జీవితాంతం పోషించడం కష్టం కాబట్టి వాటిని కోసుకుని తినడానికి అనుమతించాలని, వేదకాలపు ఆర్యుల్లో కూడా గోమాంసభక్షణ వుందన్న విషయం గ్రహించాలని కొందరు వాదిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడం రాజ్యాంగరీత్యా అనవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దాంతో 24 రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఆ పని తలపెట్టలేదు. ఈ నిషేధం కూడా అన్నిచోట్లా ఒకేలా లేదు. బెంగాల్‌లో 14 ఏళ్ల లోపు ఆవులను వధించకూడదు, తమిళనాడులో అది పదేళ్లు, అసాంలో అది నాలుగు! గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపిలలో ఏ వయసు ఆవునూ చంపడానికి వీల్లేదు.  

స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు లెక్కలోకి తీసుకుని చట్టాలు రూపొందిస్తున్నారు. మాంసభక్షణ కూడా భారతదేశమంతా ఒకేలా లేదు. మొత్తం మీద చూస్తే 31% మంది శాకాహారులు, 60% మంది మాంసాహారులు, 9% మంది గుడ్లు తినే శాకాహారులు. 2006 సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు మాంసాహారం (గుడ్లు, మాంసం, చేపలు)పై తలసరి ఖర్చు రూ.125, కేరళలో అయితే 215, గుజరాత్‌లో 24, పంజాబ్‌లో 13! ఆవులనే కాదు, గేదెలను కూడా చంపకుండా చట్టాలు జారీ చేయాలని ఆరెస్సెస్‌ ఉద్యమిస్తోంది. కానీ ఆవులు, గేదెలు ఒకే జాతికి చెందవని, కాబట్టే ఒకదానితో మరొకటి సంగమించవని సిసిఎంబి మాజీ డైరక్టర్‌ భార్గవ అంటారు. అసలు దేవుళ్ల ముందు గేదెలను బలి యిచ్చేది హిందువులే. హిందూరాజ్యమైన నేపాల్‌లోని కామాఖ్య దేవాలయంలో, కలకత్తాలోని కాళీ ఆలయంలో, మన తెలుగు ప్రాంతాల్లో కూడా దున్నపోతులను బలి యివ్వడం జరుగుతూనే వుంటుంది.  ఈ చర్చ సాగుతూండగానే రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం ఒంటెను రక్షితప్రాణిగా డిక్లేర్‌ చేసింది. దాంతో ముస్లిములకు బక్రీద్‌ నాడు ఒంటెను బలిచ్చే అవకాశం లేకుండా పోయింది.  

విజయథమి రోజున దూరదర్శన్‌లో ప్రసంగిస్తూ ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ''అన్ని రకాల మాంసాల ఎగుమతి మనం నిషేధించాలి. గోమాంసం ఎగుమతి, గోవులను చాటుగా తరలించడం వెంటనే ఆపించాలి.'' అన్నారు. దానికి ఒక పదిహేను రోజుల ముందు అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రి మేనకా గాంధీ మాంసానికి, టెర్రరిజానికి ముడిపెట్టబోయారు. ''జంతువులను చంపి, వాటి మాంసం ఎగుమతి చేసి సంపాదించిన డబ్బు టెర్రరిజానికి చేరి, అంతిమంగా మనుష్యులను చంపడానికి వుపయోగపడుతోంది'' అన్నారు. అటుతిప్పి, యిటుతిప్పి ముస్లిములకు ముడిపెడదామని చూస్తే మాత్రం పొసగదు. ఎందుకంటే భారీస్థాయి మాంసం ఎగుమతిదారులందరూ ముస్లిమేతరులే. 2012 అసెంబ్లీ ఎన్నికలలో మోదీ కాంగ్రెస్‌ సాధించినది పింక్‌ రివల్యూషన్‌ పేర మాంసం ఎగుమతులే అంటూ మతపరమైన కోణం యివ్వడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఆయన ప్రధాని చైనాతో వ్యాపారలోటు పూడ్చుకోవాలంటే మాంసం ఎగుమతులను అనుమతించడమే కాదు, పెంచవలసిన అవసరం వుంది. 2013-14లో మనం 32 లక్షల కోట్ల రూ.ల మాంసం ఎగుమతులు చేశాం. భారతదేశానికి జంతుసంపద చాలా వుంది. మనం తినకుండా, అమ్మకుండా ఏం చేయాలని వీళ్ల ఉద్దేశమో తెలియదు. 'మనం జంతువులను తినకపోతే అవే మనల్ని (ఆర్థికంగా) తినేస్తాయి' అని ఒకాయన ఛలోక్తి విసిరాడు. పార్టీలోని జైన్‌ లాబీలను తృప్తి పరచడానికి మాంసాహారంపై అప్పుడప్పుడు యిలాటి హంగామా చేసినా, మాంసభక్షణ ఎక్కువగా వున్న బెంగాల్‌, కేరళ, ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో, బిసిలు, దళితులు వగైరా వర్గాల్లో విస్తరించడానికి చూస్తున్న తరుణంలో బిజెపి దీన్ని పెద్దగా పట్టించుకోదనే అనుకోవచ్చు.   
ఎమ్బీయస్‌ ప్రసాద్ 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 15-Nov-2014 22:00:00 GMT